దారుణం…టీచర్ మీద యాసిడ్ దాడి…తీవ్రగాయాలు !

acid attack on teacher at chintal
హైదరాబాద్ లో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది, విద్యార్ధులకి విద్యా బుద్దులు నేర్పే ఓ టీచర్‌ పై దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్‌లో నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులకి అందిన వివరాల ప్రకారం చింతల్ కాకతీయ నగర్‌లో నివసిస్తున్న సూర్యకుమారి (34) అనే ఆమె స్థానిక ‘సంస్కార్’ పాఠశాలలో గత పదేళ్లుగా సోషల్ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడే పిల్లలకి ట్యూషన్స్‌ కూడా చెబుతున్నారు.
గత రాత్రి 7:30 గంటల సమయంలో సూర్యకుమారి ఇంటికి వచ్చిన ఆగంతకుడు సూర్యకుమారిని పిలిచాడు. మరో మహిళ రావడంతో సూర్యకుమారి కావాలని చెప్పడంతో ఆమె లోపలికి వెళ్లి బాధితురాలిని పంపింది. ఆమె బయటకు వచ్చిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆగంతకుడు ఆమె ముఖంపై యాసిడ్ చల్లి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందుతుడు తన ముఖానికి మాస్కు ధరించి ఈ అఘాయిత్యానికి పాల్పడటంతో బాధితురాలుగానీ, స్థానికులు గానీ అతణ్ని గుర్తుపట్టలేకపోయారు.
యాసిడ్ దాడిలో సూర్యకుమారి కళ్లకు గాయాలయ్యాయి. తప్పించుకోవడానికి పక్కకు తిరగడంతో వీపు భాగంలోనూ యాసిడ్‌ పడింది. బాధితురాలిని వెంటనే కూకట్‌పల్లిలోని రెమెడీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.