అల్లు శిరీష్ సినీ కెరీర్ పరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మెగా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికి కూడా ఈయన చేస్తున్న సినిమాలు అంతగా ఆడటం లేదు. శిరీష్ కొత్త సినిమా రాక చాలా కాలం అయ్యింది. కొన్ని కారణాల వల్ల సినిమాలకు గ్యాప్ తీసుకుని ఇటీవలే తన కొత్త సినిమాను మొదలు పెట్టిన అల్లు శిరీష్ తాను వాడుతున్న మొబైల్ నెట్ వర్క్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ట్విట్టర్లో తాను వోడాఫోన్తో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చిన అల్లు శీరీష్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
ట్విట్టర్లో ఆయన చెప్పినదాని ప్రకారం.. అల్లు శిరీష్ మొదట ఎయిర్టెల్ను వాడే వాడట. ఎయిర్టెల్ సిగ్నల్స్ సరిగా ఉండకపోవడంతో పాటు, కాల్ డ్రాపింగ్ ఎక్కువగా ఉంటుందట. దాంతో ఎయిర్టెల్ నుండి వోడాఫోన్కు అల్లు శిరీష్ షిఫ్ట్ అయ్యాడు. అలా వోడాఫోన్ కస్టమర్ అయిన అల్లు హీరో అక్కడకు వెళ్లిన తర్వాత కూడా మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. వోడాఫోన్ 4జీ కాదు కదా కనీసం 2జీ సిగ్నల్ కూడా ఉండటం లేదని, తన పరిస్థితి ప్రస్తుతం మరీ దారుణంగా తయారు అయ్యిందని చెప్పుకొచ్చాడు. కాల్ డ్రాపింగ్ గురించి ఇక చెప్పనక్కర్లేదు అని, చిరాకుగా ఉందంటూ ట్వీట్ చేశాడు. అల్లు శిరీష్ ట్వీట్కు సమాధానంగా వందలాది మంది జీయోకు మారమని సలహా ఇస్తున్నారు. మరి కొందరు ఐడియాకు మారాల్సిందిగా సూచిస్తున్నారు. మరి కొందరు మాత్రం సొంతంగా మీరు ఒక నెట్వర్కింగ్ సంస్థను ఏర్పాటు చేసి మంచి సిగ్నల్స్ను ఇవ్వడం అంటూ చెబుతున్నారు. మొత్తానికి అల్లు శిరీష్ చేసిన పోస్ట్ అందరికి వర్తిస్తుంది. కనుక అంతా కూడా ఈ విషయమై రియాక్ట్ అవుతున్నారు.