తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. మార్చి చివర్లో ‘మహానటి’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సమంత ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏయన్నార్ల పాత్రలను ప్రముఖ యంగ్ హీరోలతో చేయించబోతున్నట్లుగా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ పాత్రలకు ఏ ఒక్కరు నటించడం లేదని తేలిపోయింది.
విజువల్ ఎఫెక్ట్స్ను ఉపయోగించి ‘మహానటి’ చిత్రంలో ఎన్టీఆర్ మరియు ఏయన్నార్లను డైరెక్ట్గా దించబోతున్నారట. పాత సినిమాల్లోని ఎన్టీఆర్, ఏయన్నార్ల షాట్స్ను అందుకోసం ఉపయోగించనున్నట్లుగా తెలుస్తోంది. వారిద్దరు కూడా చాలా తక్కువ నిడివి పాత్రలో కనిపిస్తారని, వారికి మ్యాచ్ అయ్యే డబ్బింగ్ ఆర్టిస్టులను ప్రస్తుతం దర్శకుడు నాగ్ అశ్విన్ వెదికే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్, ఏయన్నార్ల పాత్రలను సాదా సీదా వారితో వేయించడం సాధ్యం కాదు. అలా అని జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యలను ఈ చిత్రంలో నటింపజేసే అవకాశం లేదు. అందుకే గ్రాఫిక్స్ను దర్శకుడు ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్, ఏయన్నార్లు ఉన్నారు, కాని వారు ఉండరు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.