తేజూ నో చెప్పలేదన్న గోపీచంద్‌

director gopichand Malineni gives clarity on movie with sai dharam tej

వరుస పరాజయాల పాలవుతున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తాజాగా ‘తేజ్‌ ఐలవ్‌ యూ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్లీ నిరాశ పర్చాడు. భారీ అంచనాలున్న ఆ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. దాంతో తేజూ తన సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని, అందుకే ఇప్పటికే కమిట్‌ అయిన గోపీచంద్‌ మలినేనికి నో చెప్పాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘విన్నర్‌’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అయినా కూడా గోపీచంద్‌ మలినేనిపై ఉన్న నమ్మకంతో మరో ఛాన్స్‌ను ఇవ్వాలని అప్పుడు భావించిన తేజూ, ఇప్పుడు ఆయనతో సినిమాను సాహసంగా భావించి క్యాన్సిల్‌ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలో గోపాల్‌ అనే కొత్త దర్శకుడితో సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఇప్పటికే భగవద్గీత సాక్షిగా అంటూ ఆ మూవీకి టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. కిషోర్‌ తిరుమల మూవీ పూర్తి అవ్వగానే గోపాల్‌ దర్శకత్వంలో మూవీని తేజూ చేయబోతున్నాడు. ఠాగూర్‌ మధు నిర్మించబోతున్న ఈ చిత్రం ఇదే ఏడాది వచ్చేలా తేజూ ప్లాన్‌ చేస్తున్నాడు. రెండు చిత్రాలను చేస్తూన్న తేజూ గోపీచంద్‌ చిత్రాన్ని వదులుకున్నాడు అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు గోపీచంద్‌ స్పందించాడు. త్వరలో తాను తేజూతో ఒక చిత్రాన్ని చేయబోతున్నాను అని, కాస్త సమయం పట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. తేజూ తనతో మూవీని క్యాన్సిల్‌ చేసుకున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది తేజూ, గోపీచంద్‌ మలినేనిల కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.