ట్రాంప్ వలలో తెలుగు విద్యార్ధులు…!

Feds Used Fake University In Immigration Sting 8 Telugu People Arrested

చదువు, ఉద్యోగాల నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడ అక్రమంగా నివసిస్తోన్న విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా ఝుళిపించింది. పక్కా ప్రణాళిక ప్రకారం వల వేసి పట్టుకుంది. నకిలీ ధ్రువపత్రాలతో అమెరికా వచ్చేవారి కోసం ఒక ఫేక్ యూనివర్సిటీని సృష్టించిన ఫెడరల్ ఏజెంట్స్ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించి అక్రమ వలసదారులను గుర్తించారు. వీరిలో అత్యధికంగా తెలుగు విద్యార్థులు ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. ది యూనిటివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ లో స్టాఫ్ లేరు, ఇన్‌స్ట్రక్టర్లు లేరు. అసలు ఈ యూనివర్సిటీకి ఒక కర్రిక్యులమే లేదు. క్లాసులు కూడా జరగవు, కానీ విద్యార్థులు మాత్రం 600 మంది వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది నకిలీ ధ్రువపత్రాలతో అక్రమంగా వలసవచ్చి చేరిన వారే. యూనివర్సిటీలో విద్యార్థులుగా ప్రవేశం పొంది వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు.

ఈ తతంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు పూర్తి వివరాలను ట్రంప్ ప్రభుత్వానికి అందజేశారు. దీంతో ఈ అక్రమ వ్యవహారం బుధవారం బయటపడింది. ఈ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం రిక్రూటర్స్‌గా వ్యవహరించిన 8 మంది తెలుగు వ్యక్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. యూనివర్సిటీలో ప్రవేశం పొందిన సుమారు 600 మంది విద్యార్థులు విదేశీయులే అని అధికారులు గుర్తించారు. వీరంతా అక్రమంగా, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో యూఎస్‌లో ఉంటున్నారని, విద్యార్థుల పేరిట చలామణీ అవుతున్నారని తేల్చారు. వీరికి యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పించింది ఈ 8 మంది భారత పౌరులేనని నిర్ధారించారు. ఈ 8 మందితో పాటు యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌కు చెందిన చాలా మంది విద్యార్థులను ఫెడరల్ ఏజెంట్స్ అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.