కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) నటించిన తాజా చిత్రం కరుప్పు / వీర భద్రుడు అంచనాలను తలకిందులు చేస్తూ సెన్సేషనల్ హిట్గా నిలిచింది. విడుదలకు ముందు పెద్దగా హైప్ లేకపోయినా, సినిమా రన్ మొదలయ్యాక మాట మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు 300 కోట్ల మార్క్ను టచ్ చేసే దిశగా దూసుకుపోతోంది. దీంతో సూర్యకు ఇది పవర్ఫుల్ కంబ్యాక్గా మారింది.
ఇదివరకు సూర్య రీఎంట్రీ వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా ద్వారానే వస్తుందని చాలా మంది భావించారు. కానీ కరుప్పు మాత్రం అనుకోని సర్ప్రైజ్గా మారి, సూర్య కెరీర్లో మరో హైలైట్గా నిలిచింది. ఇదే ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ ముందు పెద్ద సవాలుగా మారింది.
ఇప్పటి వరకు ఒక హిట్ కావడమే లక్ష్యంగా ఉండేది. కానీ కరుప్పు ఇచ్చిన భారీ విజయంతో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ కేవలం హిట్ అయితే సరిపోదు, కరుప్పును మించే బాక్సాఫీస్ సక్సెస్ అందుకోవాల్సిన ఒత్తిడి ఏర్పడింది.
ఈ సినిమాపై తెలుగు, తమిళ్ రెండింట్లోనూ మంచి బజ్ ఉంది. రెండు మార్కెట్లలో సమానంగా వసూళ్లు వస్తే కరుప్పు టార్గెట్ను చేరుకోవచ్చు. అయితే వెంకీ అట్లూరి గత చిత్రం ‘సార్’ విషయంలో తెలుగులో బలమైన వసూళ్లు వచ్చినప్పటికీ, తమిళ్లో ఆశించిన స్థాయిలో రాలేదు. అదే ట్రెండ్ మళ్లీ రిపీట్ అయితే మాత్రం ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ ముందు ప్రయాణం అంత ఈజీ కాదనే చెప్పాలి.
