ఓవర్సీస్‌లో బాలయ్య పరువు పోయే..

Jai Simha overseas collections shocking

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగులో విడుదలైన చిన్న చిత్రాలు కూడా ఇటీవల ఓవర్సీస్‌లో మిలియన్‌ మార్క్‌ చేసి సత్తా చాటాయి. తెలుగులో పెద్ద హీరోల సినిమాలు ఓవర్సీస్‌లో మినిమం మిలియన్‌ గ్యారెంటీ అంటూ టాక్‌ పడిపోయింది. అందుకే స్టార్‌ హీరోల సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి డిమాండ్‌ ఉంది. కాని బాలకృష్ణ, నయనతార కలిసి నటించిన ‘జైసింహా’ మాత్రం ఓవర్సీస్‌లో దారుణంగా ఫ్లాప్‌ అయ్యింది. ఏమాత్రం కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది. అయిదు కోట్ల రూపాయలను ఓవర్సీస్‌ నుండి చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశించారు. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కనీసం కోటి రూపాయల షేర్‌ను కూడా జైసింహా ఓవర్సీస్‌ నుండి రాబట్టలేక పోయింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

బాలకృష్ణకు ఓవర్సీస్‌లో పెద్దగా మార్కెట్‌ లేదు. గత చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ఓవర్సీస్‌లో మంచి విజయాన్ని సాధించడానికి కారణం ఆ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం అవ్వడంతో పాటు, అదో ఛారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అవ్వడం. ఆ స్థాయిలో కాకున్నా కాస్త పరువు నిలిపే విధంగా అయినా కలెక్షన్స్‌ను సాధిస్తుందని భావించారు. కాని ఓవర్సీస్‌లో బాలయ్య పరువు తీసింది. పవన్‌ అజ్ఞాతవాసి చిత్రానికి భారీగా ఓవర్సీస్‌ ప్రీమియర్‌ షోల ద్వారా కలెక్షన్స్‌ వచ్చాయి. అజ్ఞాతవాసి చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో బాలయ్య సినిమాకు కలిసి వస్తుందని భావించారు. కాని బాలయ్య సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో కోటి కూడా కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది