బాణాసంచా కాల్చిన వాళ్లకు చురకలు వేసిన మంచు మనోజ్

బాణాసంచా కాల్చిన వాళ్లకు చురకలు వేసిన మంచు మనోజ్

దీపం వెలిగించి దేశ ఐక్యత చాటమని ప్రధాని మోడీ పిలుపుని ఇస్తే.. కొంతమంది దీపాలకు బదులు కొంపలు తగలెట్టడానికి రెడీ అయ్యారు. దీపాలకు బదులుగా భారీ శబ్ధాలతో బాణాసంచా కాల్చుతూ అత్సుత్సాహం చూపించారు. కొంతమంది అయితే రోడ్లపైకి వచ్చి పెద్ద పెద్ద మంటలు వేస్తూ క్రాకర్స్ కాల్చి హంగామా చేశారు. కొన్నిచోట్ల ఈ క్రాకర్స్ వల్ల భారీ అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి అంటే వీళ్ల పైత్యం ఏం రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఓ పక్క జనం చచ్చిపోతూ ఉంటే బాణాసంచా కాల్చుకుంటూ సంబరాలు ఏంటి అసలు ప్రధాని చెప్పింది ఏంటి? వీల్లు చేస్తుంది ఏంటి అంటూ ట్విట్టర్‌లో ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. నిజానికి ప్రధాని ఓ మంచి ఉద్దేశంతో ఈ దీపాలు వెలిగించే కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పటికీ కొంతమంది క్రాకర్స్ కాల్చి నానా రచ్చ చేయడంతో విమర్శలకు తావిస్తోంది.

తాజాగా ఈ ఇష్యూపై ఫైర్ అవుతూ సంచలన ట్వీట్స్ చేశారు హీరో మంచు మనోజ్. బాణాసంచా కాల్చడం వల్ల జరిగిన భారీ అగ్ని ప్రమాదాల వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఇలాంటి పనుల్ని చేసే వాళ్లని తనదైన శైలిలో ఏకిపారేశారు మంచు మనోజ్. ‘ఈ క్రాకర్స్ చూస్తే.. మనవాళ్లు కరోనాని కూడా సీఎం లేదా పీఎం చేస్తారనుకుంటా.. ఓరి దీనమ్మా బతుకు.. మళ్లీ జై కరోనా అంట’ అంటూ ఫైర్ అవుతూ ట్వీట్ వదిలారు.

‘రేయ్ ఇడియట్స్.. ఆ క్రాకర్స్ కాల్చడం ఆపండ్రా.. మనం మనుషులే తప్ప మూర్ఖులం కాదు.. క్రాకర్స్ కాల్చమని మిమ్మల్ని ఎవరూ అడగలేదు.. చదువుకున్న వాళ్లు మాత్రమే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారు’ అంటూ క్రాకర్స్ కాల్చిన వాళ్లకు చురకలు వేశారు హీరో మంచు మనోజ్.