లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ

లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తోంది. 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది మోదీ ప్రభుత్వం. మరో 8రోజుల్లో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. మరి ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రధాని… కేంద్రమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై కూడా ఆదివారం ప్రధాని పలువురు రాజకీయ నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌కు ఫోన్ చేశారు ప్రధాని మోదీ. కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. దీంతో పాటు మాజీ ప్రధానులు దేవగౌడ, మన్మోహన్ సింగ్‌తో మోదీ చర్చలు జరిపారు. కరోనా నివారణ చర్యలపై వారితో చర్చించారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, బెంగాల్ సీఎం మమత, స్టాలిన్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఇలా ప్రముఖ నేతలందరికీ ఫోన్ చేసి కరోనాపై చర్చించారు.

దీంతో దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పటికే నాలుగువేలు దాటింది. ఇప్పటివరకు భారత్‌లో ఈ వ్యాధి బారిన పడి 118 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏప్రిల్ 6న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం మోదీ లాక్ డౌన్ పై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.