ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్….మాజీ టీడీపీ ఎమ్మెల్యే మీద మర్డర్ ఆరోపణలు

Murder allegations on Former TDP MLA

హైదరాబాద్ నడిబొడ్డున సంచలనం రేపిన స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యాపార లావాదేవీలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. ఇక దీని వెనుక విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త, రౌడీషీటర్ కోగంటి సత్యం ఉన్నట్లు రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపణలు చేయడంతోపంజాగుట్ట నుంచి విజయవాడకు సీన్ మారింది. తెలంగాణ పోలీసులు నేరుగా కోగంటి సత్యం ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. కోగంటి అల్లుడు కృష్ణా రెడ్డి, ప్రధాన అనుచరుడ్ని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం కృష్ణా రెడ్డిని పడమట పోలీస్ స్టేషన్‌‌కు తీసుకెళ్లి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. విట్‌నెస్ నోటీసు ఇచ్చి అతడ్ని హైదరాబాద్ తీసుకెళ్లారు పోలీసులు. ఇటు రాంప్రసాద్ హత్యకేసులో ఆరోపణలు రావడంపై కోగంటి సత్యం స్పందించారు. ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన ఆయన ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఈ హత్య చేయించాలనుకుంటే ఎప్పుడో చేయించేవాడినని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావులే రాంప్రసాద్‌ని చంపించి ఉంటారని ఆయన ఆరోపించారు. రాంప్రసాద్ తనకు, తుక్కు ఇనుము సరఫరా చేసిన వ్యాపారులకి రూ.70 కోట్లు ఎగ్గొట్టి తప్పించుకు తిరిగారని, రాం ప్రసాద్‌ కు తానే కాక చాలామంది శత్రువులున్నారని అన్నారు కోగంటి. రాంప్రసాద్‌ని చంపితే తనకి రావాల్సిన కొట్లాది రూపాయలు ఎలా వస్తాయని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇక రామ్ ప్రసాద్ భార్య వైదేహి తనకు చెల్లలితో సమానం.. ఆమె తనపై ఎందుకు ఆరోపణలు చేస్తోందో అర్ధం కావడం లేదన్నారు. త్వరలోనే అన్ని వాస్తవాలు బయటపడతాయంటున్నారు సత్యం.