టీడీపీకి రాజీనామా…వైసిపీలో చేరిన ఎంపీ !

Muttamsetti Srinivasa Rao Joins YCP

అనుకుంటూన్నట్టుగానే ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. కొద్ది సేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపిన ఆయన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని హోదాపై చంద్రబాబు మాట మార్చారని అనుభవం ఉందని ప్రజలు గెలిపిస్తే బాబు రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నారని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నారని, ఆయన మాట ఇస్తే తప్పరని అవంతి చెప్పుకొచ్చారు. ఈ అవినీతి పాలనకు చరమగీతం పాడి వైసీపీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ అనకాపల్లి నుంచి ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన భీమిలి నుంచి బరిలోకి దిగాలనుకుంటున్నారు.

ఆ నియోజకవర్గం నుంచి మంత్రి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన మనసులో మాటను చంద్రబాబుకు ఇప్పటికే చెప్పేశారట కానీ టికెట్‌పై క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అవంతి పార్టీ మారతారని ప్రచారం జరగడంతో టీడీపీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేసింది. కాని ఆయన నేతలకు అందుబాటులోకి రాకపోగా నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారట. గంటా శ్రీనివాస్‌ కు సన్నిహితుడైన అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక 2014లో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీలో చేరబోతున్న అవంతి భీమిలీలో గంటాతో పోటీకి సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ఇప్పటికే భీమిలి వైసీపీ సమన్వయకర్తగా ఉన్న విజయనిర్మల భీమిలి సీటు తనదే అని, తనకు జగన్ హామీ ఇచ్చారని ఆమె స్పష్టం చేశారు. అధిష్టానం నుంచి తనకు పిలుపు రాలేదని తెలిపారు. పార్టీలో ఎవరైనా చేరొచ్చని సీటు మాత్రం తనాడే అని ఆమె చెబుతున్నారు.