పవన్ ఏమి ట్వీటావు…..ఏం చేశావ్ !

pavan-stand-confuses-janasena-leaders

 

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం ఏపీ రాజకీయాల్లో ఎన్నని ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే సహజంగా చిన్న చిన్న విషయాలకు సైతం ఊగిపోతూ ఆవేశపడుతూ పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి ప్రజల్లో ఏర్పడింది. దానికి తగ్గట్లుగానే నిన్న ఆయన భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చాలా ఆవేశంగా ప్రసగించారు. గూండాలు, ఫ్యాక్షనిస్టులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని ఇలా చాలా చాలా మాట్లాడారు. అన్నీ జగన్‌కు గురి పెట్టినవే. కానీ ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించలేదు. అలా అని జగన్‌ను కాకుండా జనరల్‌గా అన్నారని ఎవరూ అనుకోలేదు.

కానీ రాత్రికి రాత్రి ఏ బోధి చెట్టు దొరికిందో గానీ ఉదయమే ఆయన దానికి విరుద్ధంగా ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని అత్యంత వినయంగా సంబోధిస్తూ చేసిన ట్వీట్ జనసేన వర్గాలను కూడా విస్మయ పరిచింది. జగన్మోహన్ రెడ్డిని అత్యంత వినయంగా సంబోధిస్తూ ఆయన తన మీద చేసిన వ్యాఖ్యల వల్ల ఇతరులు బాధపడినట్లు తెలిసిందని ఎవరూ జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దనేది ఆ ట్వీట్ సారాంశం. వివాదాన్ని ఇంతటితో ముగించాలని కూడా ఆయన ఆ ట్వీట్ చివరిలో ప్రార్థనాపూర్వకంగా కోరారు. పవన్ కల్యాణ్ ట్వీట్ అటు జనసేన వర్గాల్లోనూ ఇటు సామాన్య ప్రజానీకంలోను అనేక అనుమానాలు రేకెత్తించాయి. దానికి కారణం చేసిన ఆ ట్వీట్‌కి విరుద్ధంగా పవన్ వ్యవహారాలు ఉండటమే.

వ్యక్తిగతంగా తాన ఎవర్నీ ఏమీ అననని ట్వీట్‌ చేసిన పవన్ ధోరణి ఇప్పుడు జనసేన వర్గాల్లో అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఎదో సందర్భం దొరికింది కదా అని నీతులు చెప్తున్నా ఇలా కొందరిని వ్యక్తిగతంగా పబ్లిక్ ఫ్లాట్ ఫాం మీద చేసిన వ్యాఖ్యల వల్ల పవన్ కల్యాణ్ కేసులు కూడా ఎదుర్కొంటున్న విషయాన్ని మర్చిపోతే ఎలా ? కొద్ది రోజుల క్రితం టాలీవుడ్‌లో శ్రీరెడ్డి అనే నటీమణి విషయంలో ఏర్పడిన వివాదంలో మీడియాదే తప్పని తేల్చిన పవన్ అప్పుడు టీవీ నైన్ సీఈవో రవిప్రకాష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎంపీ వేమూరి రాధాకృష్ణ కుటుంబసభ్యుల ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి వ్యాఖ్యలు చేశారు. అప్పుడే పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ మీడియా సంస్థల యజమానులు పరువు నష్టం కేసులుకూడా వేశారు. కానీ పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ట్వీట్ చేయడంతో చెప్పేటందుకే నీతులున్నాయని పవన్ రుజువు చేస్తున్నారంటున్నారు విశ్లేషకులు.