అన్నపూర్ణ స్టూడియోస్‌ అధినేత సమంత

Samantha Akkineni Take Responsibility of Annapurna Studios

అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియో తెలుగు సినిమా చరిత్రలో ఒక భాగం అయ్యింది. తెలుగు సినిమా పరిశ్రమను చెన్నై నుండి తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌కు అప్పట్లో తీసుకు వచ్చేందుకు ఎన్టీఆర్‌ చాలా ప్రయత్నాలు చేశారు. ఎన్టీఆర్‌ సూచన మేరకు ఏయన్నార్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌ను నిర్మించడం జరిగింది. అప్పట్లో సాదా సీదాగా నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోను మారుతున్న పరిస్థితులు మరియు టెక్నాలజీకి అనుగుణంగా మార్చుతూ వచ్చారు. ప్రపంచంలోని అత్యుత్తమ టెక్నాలజీని ఈ స్టూడియోలో అందించడంతో షూటింగ్‌కు అనుకూలంగా అంతా భావిస్తున్నారు. షూటింగ్స్‌తో పాటు సీరియల్స్‌ మరియు రియాల్టీ షోలకు కూడా ఈ స్టూడియోను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతుంది.

ఇంతటి ప్రాముఖ్యత, ప్రాచుర్యం ఉన్న అన్నపూర్ణ స్టూడియోను అక్కినేని కుటుంబ సభ్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నడుపుతూ ఉన్నారు. ఇక అన్న పూర్ణ స్టూడియోను కుటుంబం మొత్తం కాకుండా ఒక్కరు స్వాదీనం చేసుకునే సమయం వచ్చింది. అంటే ఆస్తుల పంపకం జరిగిందని, ఆస్తుల పంపకంలో అన్నపూర్ణ స్టూడియో నాగచైతన్య వశం అయినట్లుగా తెలుస్తోంది. నాగచైతన్య భార్య సమంతకు అన్నపూర్ణ స్టూడియోపై చాలా మక్కువ ఉంది. అందుకే కావాలని అన్నపూర్ణ స్టూడియోను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జునను ఒప్పించి, కుటుంబ సభ్యులందరితో మాట్లాడి అన్నపూర్ణ స్టూడియోను దక్కించుకోవడంలో సమంత సఫలం అయ్యింది. నాగచైతన్య మెజార్టీ వాటాను అన్నపూర్ణ స్టూడియోలో దక్కించుకున్నా, ఇతర కుటుంబ సభ్యులకు కూడా చిన్న మొత్తంలో వాటా ఉంటుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఈ అన్నపూర్ణ స్టూడియో చేతులు మార్పిడి మరియు అక్కినేని వారి ఆస్తుల పంపకం విషయంలో అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.