ఎప్పుడు ఏదో ఒక విషయమై వివాదంలో ఉండే బండ్ల గణేష్ మరో వివాదంలో ఇరుకున్నాడు. తాజాగా బండ్ల గణేష్పై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. తమను మోసం చేయడంతో పాటు కులం పేరుతో దూషించి, తీవ్రంగా అవమానించాడు, దాడి చేయించాడు అంటూ బండ్ల గణేష్పై కృష్ణవేణి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఎంక్వౌరీ చేస్తున్నారు. త్వరలోనే బండ్ల గణేష్తో పాటు ఆయన సోదరుడు శివబాబులపై కూడా పోలీసులు చార్జ్ షీట్ ఓపెన్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే… షాద్నగర్కు చెందిన డాక్టర్ దిలీప్ చంద్ర ఆయన భార్య కౌన్సిలర్ కృష్ణవేణిలతో బండ్ల గణేష్ పౌల్ట్రీ ఫామ్ మరియు వ్యవసాయ భూముల కొనుగోలు ఒప్పందంలో వివాదం నెలకొంది. ఆ భూములను కొన్ని కారణాల వల్ల బ్యాంకు సీజ్ చేసి వేలం పాట వేయడం జరిగింది. దాంతో బండ్ల గణేష్ వద్దకు దిలీప్ మరియు కృష్ణవేణి తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ అడిగేందుకు వెళ్లారు. అక్కడ బండ్ల గణేష్ మరియు ఆయన సోదరుడు శివబాబులు కృష్ణవేణిని కులం పేరుతో దూషించడంతో పాటు, చేయి కూడా చేసుకున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ వివాదంను మొదట రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కాని కృష్ణవేణి మరియు బండ్ల ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉండటంతో పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేపట్టారు.