నూతన్‌ నాయుడు రీ ఎంట్రీపై మళ్లీ అనుమానాలు!

Shyamala and Nutan Naidu Re-entry in Bigg Boss Show

తెలుగు బిగ్‌బాస్‌లో ఎవరు ఊహించని పరిణామం జరిగింది. మొదటి నుండి చెబుతున్నట్లుగా ఏదైనా జరగొచ్చు అనే ట్యాగ్‌ లైన్‌కు సరిగ్గా సూట్‌ అయ్యేలా నిర్వాహకులు ఎలిమినేట్‌ అయిన ఇద్దరు ఇంటి సభ్యులను మళ్లీ ఇంట్లోకి పంపించేందుకు సిద్దం అయ్యారు. ఆరు వారాల్లో ఆరుగురు ఎలిమినేట్‌ అవ్వగా వారిలో ఎవరిని ఇంట్లోకి మళ్లీ పంపించాలని మీరు అనుకుంటున్నారు అంటూ బిగ్‌బాస్‌ ఓటింగ్‌ నిర్వహించడం, ఓటింగ్‌లో అత్యధికంగా 12 కోట్ల ఓట్లు పోల్‌ అవ్వడం జరిగింది. దాంతో ఇద్దరిని ఇంట్లోకి పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వారిద్దరు శ్యామల మరియు నూతన్‌ నాయుడు అంటూ తేలిపోయింది. తేజస్వి వంటి సెలబ్రెటీ, స్టార్‌ను పక్కకు నెట్టేసి నూతన్‌ నాయుడు భారీ ఓట్లను దక్కించుకోవడం వెనుక ఏదైనా మతలబు ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నూతన్‌ నాయుడు బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లేందుకు ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. నిప్పులేనిదే పొగ రాదు అన్నట్లుగా, అందుకు సంబంధించిన చిన్న ఆధారం కూడా లేకుండా ఆ పుకార్లు రావు. నాలుగు కోట్లు కాకున్నా కాస్త అటు ఇటుగా అయినా ఇచ్చి ఉంటాడేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే వాటిని పుకార్లే అంటూ నూతన్‌ నాయుడు కొట్టి పారేశాడు. ఆ తర్వాత కూడా ఎంత డబ్బు అయినా ఇచ్చేందుకు నూతన్‌ నాయుడు సిద్దంగా ఉన్నాడు, ఆయన్ను లోనికి పంపించాలని నిర్వహకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చాయో లేదో వెంటనే రీ ఎంట్రీకి ఓటింగ్‌ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో సామాన్యుడు అయిన నూతన్‌ నాయుడుకు ఎక్కువ ఓట్లు రావడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. వెనుక మళ్లీ ఏదో రాజకీయం జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నూతన్‌ నాయుడును ఒక్కడినే పంపితే అనుమానం మరింతగా ఉంటుందనే ఉద్దేశ్యంతో శ్యామలను కూడా లోనికి పంపించినట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన వీరిద్దరు షోలో ఎలా ఆడబోతున్నారు అనేది చూడాలి.