టీఆర్ఎస్ కి షాక్….కాంగ్రెస్ కి మజ్లిస్ మద్దతు…!

Telangana Aimim Supports Congress Candidate In Muthol

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మజ్లీస్ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. మజ్లీస్ అభ్యర్థులు పోటీ చేసే నియోజకర్గాల్లో తప్ప రాష్ట్రంలోని మిగతా అన్నిచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులకే ఆ పార్టీ కార్యకర్తలు, సపోర్టర్లు మద్దతిస్తున్నారు. అయితే ఒక్క నియోజకవర్గంలో మాత్రం మజ్లీస్ టీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దులో గల నియోజకవర్గం ముథోల్. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మరోసారి పోటీకి దిగుతుండగా కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే రామా రావు పటేల్ బరిలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కు మద్దతిస్తున్న ఎంఐఎం పార్టీ ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రామా రావు పటేల్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకుంది.

Aimim-party

ఈ మేరకు మజ్లీస్ పార్ట జిల్లా అధ్యక్షుడు జబీర్‌ అహ్మద్‌ ఓ ప్రకటన జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ నియోజకవర్గ పరిధిలోని బైంసా పట్టణంలో జరిగిన మైనారిటీ సమావేశంలో జబీర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రావు గత నాలుగున్నరేళ్లు ఎమ్మెల్యేగా వుండి నియయోజవర్గానికి, మైనారిటీలకు చేసిందేమీ లేదని అందువల్లే అతడికి మద్దతివ్వడం లేదని ఆయన తెలిపారు. నిస్వార్థపరుడైన కాంగ్రెస్ అభ్యర్థి రామా రావు పటేల్ కు మద్దతుగా మజ్లీస్ కార్యకర్తలు పనిచేయాలని జబీర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థిని కాదని కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వడంతో ఆ నియోజకర్గంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. సదరు నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉండటంతో టీఆర్ఎస్ పార్టీకి ఈ నిర్ణయం తీవ్ర నష్టం చేస్తుందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.