TG Politics: రేవంత్‌ ప్రభుత్వంపై అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర కామెంట్స్

TG Politics: Asaduddin Owaisi's interesting comments on Revanth Govt
TG Politics: Asaduddin Owaisi's interesting comments on Revanth Govt

హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రోజున శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పాటు సభలో పాల్గొన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డికి స్వాగతం అంటూ వెల్ కమ్ చెప్పిన ఆయన.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మేము స్వాగతిస్తున్నాం. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నాం అని అన్నారు.

అంతే కాకుండా రేవంత్ చేతుల్లో ఐదేళ్లు అధికారం ఉంటుందని, ఆయన చేసే అభివృద్ధికి తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఇటీవల రేవంత్‌ సర్కారు త్వరలో కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే అంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అయిదేళ్లు అధికారం ఉంటుందని తాజాగా అసద్‌ స్వయంగా సీఎం సమక్షంలో పేర్కొనడం గమనార్హం. అంతేకాక రేవంత్‌ మొండిఘటమని.. పోరాడి అధికారం సాధించుకున్నారని ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధిలో ఎంఐఎం భాగస్వామి అవుతుందని అసదుద్దీన్ అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్నీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.