TS Politics: సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్

TS Politics: Bandi Sanjay wrote an open letter to CM Revanth Reddy
TS Politics: Bandi Sanjay wrote an open letter to CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో కోరిన బండి సంజయ్‌…తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం అని ఫైర్‌ అయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన విషయం మీకు విధితమేనని… బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు నమ్మి తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల సర్పంచ్‌లు తమ స్వంత నిధులు ఖర్చు చేసి గ్రామాభివృద్ధికి పనులు చేపట్టారని గుర్తు చేశారు.

కొంత మంది సర్పంచ్‌లు తమ స్వంత ఆస్తులమ్మి, అప్పులు చేసి మరీ అబివృధ్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. అయితే ఈ పనులకు సంబంధించి ఇప్పటి వరకు బిల్లులు మంజూరు చేయకపోగా, చేసిన పనులకు చాలా పంచాయతీల్లో రికార్డు చేయకుండా ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వెంటనే సర్పంచ్‌లు చేసిన పనులను రికార్డు చేయమని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీచేయాలని కోరుతున్నామన్నారు బండి సంజయ్‌.