VV Vinayak: అతడిలా ఒక్కరోజైనా బతకాలి.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనలాగే పుట్టాలి!

VV Vinayak: అతడిలా ఒక్కరోజైనా బతకాలి.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనలాగే పుట్టాలి!
VV Vinayak: అతడిలా ఒక్కరోజైనా బతకాలి.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనలాగే పుట్టాలి!

దర్శకుడు వి.వి. వినాయక్ తన సినీ ప్రయాణంలో కలిసి పనిచేసిన, అదే సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చిన సహచర దర్శకులు పూరి జగన్నాథ్, ఎస్.ఎస్. రాజమౌళితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ముగ్గురి ప్రయాణం దాదాపు ఒకే సమయంలో ప్రారంభమైందని, ఆ తర్వాత ముగ్గురూ తమదైన శైలిలో సక్సెస్ అందుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు.

అయితే ఈ ముగ్గురిలో పూరి జగన్నాథ్ వ్యక్తిత్వం తనను ఎప్పుడూ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని వినాయక్ చెప్పారు. పూరి ఏ విషయాన్నీ ఎక్కువగా తలకెక్కించుకోరని, చాలా తేలికగా, ధైర్యంగా జీవితాన్ని తీసుకుంటారని అన్నారు. ముఖ్యంగా సినిమా హిట్, ఫ్లాప్ అనే విషయాలను ఆయన ఒకే విధంగా చూస్తారని ప్రశంసించారు.

దీనికి ఉదాహరణగా ‘శివమణి’ సినిమా విడుదలైన సందర్భాన్ని వినాయక్ VV Vinayak గుర్తుచేసుకున్నారు. సినిమా మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకుందని, పరిస్థితి చాలా దారుణంగా ఉందని పూరికి ఫోన్ చేసి చెప్పినప్పటికీ ఆయన ఏమాత్రం కంగారు పడలేదని తెలిపారు. ప్రశాంతంగా ఫోన్ చూస్తూ, ‘ఇంకేంటి.. రేపు కలుద్దాం’ అన్నట్టుగా స్పందించారని చెప్పారు.

ఒక సినిమా ఫలితం గురించి అంత తేలికగా ఎలా తీసుకోగలుగుతున్నాడో అప్పుడు తనకు అర్థం కాలేదని వినాయక్ అన్నారు. ఆ సంఘటన తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. పూరి జగన్నాథ్‌లో ఉన్న ఈ నిర్లిప్తత, ధైర్యం తనకు ఎంతో నచ్చుతాయని చెప్పారు. అందుకే మళ్లీ జన్మంటూ ఉంటే పూరిలా పుట్టాలని, కనీసం ఒక్కరోజైనా ఆయనలా జీవించాలని ఉందని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.

ఇక ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సమయంలో ఎదురైన పరిస్థితులను కూడా వినాయక్ ప్రస్తావించారు. సినిమా విడుదలైన తర్వాత తొలి మూడు, నాలుగు రోజులు కొంత నెగటివ్ టాక్ రావడంతో రాజమౌళి, ప్రభాస్ సహా చిత్ర బృందం తీవ్రంగా నిరాశకు గురైందని తెలిపారు. వారంతా డల్‌గా కనిపించారని, బయట వినిపిస్తున్న మాటలు నిజమేనేమోనని భావించారని గుర్తుచేసుకున్నారు.

అయితే ‘బాహుబలి’ స్థాయిని ప్రేక్షకులు పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టిందని, దాదాపు ఏడు నుంచి పది రోజుల తర్వాత సినిమా గురించి పూర్తి స్థాయి పాజిటివ్ స్పందన వచ్చిందని వినాయక్ పేర్కొన్నారు. కానీ ఆ తొలి మూడు, నాలుగు రోజులు చిత్ర బృందం అనుభవించిన టెన్షన్, బాధ మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు.

ఈ సందర్భంలో పూరి జగన్నాథ్ వైఖరి పూర్తిగా భిన్నంగా ఉంటుందని వినాయక్ వివరించారు. విజయాన్ని, పరాజయాన్ని పూరి ఒకే రీతిలో తీసుకుంటారని, ఒక సినిమా పూర్తయిన వెంటనే దాని ఫలితాన్ని పక్కన పెట్టి తదుపరి కథపై దృష్టి సారిస్తారని చెప్పారు.

అదే సమయంలో కమర్షియల్ సినిమాలకు లభిస్తున్న గుర్తింపుపై కూడా వినాయక్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కమర్షియల్ చిత్రాలను చాలామంది తక్కువగా చూస్తారని, అవి భారీగా డబ్బులు సంపాదించిన తర్వాత మాత్రమే వాటి విలువను గుర్తిస్తారని అన్నారు. ఆర్ట్ ఫిల్మ్ దర్శకులతో పోలిస్తే కమర్షియల్ సినిమా దర్శకులకు మీడియా, మేధావి వర్గాల్లో తగినంత గౌరవం లభించడం లేదని అభిప్రాయపడ్డారు.

కేవలం నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో ప్రేక్షకులను మెప్పించేలా సినిమా రూపొందించడం అంత సులభం కాదని వినాయక్ అన్నారు. ఈ విషయాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కూడా తనతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఒక పుస్తకం ఆధారంగా కథను తీసుకుని ఆర్ట్ ఫిల్మ్ రూపొందించడం ఒక విధమైన సవాలు అయితే, పాటలు, ఫైట్లు, కామెడీ, ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్నో అంశాలను ఒకే కథలో కలిపి కమర్షియల్ హిట్ అందించడం మరో రకమైన పెద్ద సవాలు అని వివరించారు.

కమర్షియల్ సినిమాల్లో కథకు నేరుగా సంబంధం లేని అనేక అంశాలను కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మేళవించాల్సి ఉంటుందని వినాయక్ తెలిపారు. అందుకే కమర్షియల్ సినిమా తీయడం కూడా ఎంతో కష్టమైన పని అని అన్నారు. మొత్తంగా పూరి జగన్నాథ్ వ్యక్తిత్వం, ఆయన జీవితాన్ని చూసే విధానం తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని వి.వి. వినాయక్ చెప్పుకొచ్చారు.