Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ రాజకీయ పార్టీకైనా దశదిశ, అంతర్గత నిర్మాణం ఎంతో అవసరం. ఈ విషయం వైసీపీ కి 2014 ఎన్నికల ఫలితాలు చూసాకే అర్ధం అయ్యింది. కానీ 2019 ఎన్నికలు గుర్తు వచ్చాక గానీ నేర్చుకున్న పాఠాలు అప్పజెప్పేందుకు వైసీపీ రెడీ కాలేదు. టీడీపీ మహానాడు టైపులో పార్టీ ప్లీనరీ నిర్వహించడానికి వైసీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయి ప్లీనరీకి సన్నాహకంగా ఇప్పటికే జిల్లా స్థాయి ప్లీనరీలు నిర్వహించింది వైసీపీ. అయితే రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఎలా చేస్తుంది, ఎక్కడ చేస్తుంది అన్న ప్రశ్నలు వైసీపీ శ్రేణుల్ని వెంటాడుతూనే వున్నాయి. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది.
2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు సీఎం గా పదవీప్రమాణం చేసిన స్థలాన్నే వైసీపీ తన ప్లీనరీ వేదికగా నిర్ణయించుకుంది. రాజధాని అమరావతికి సమీరంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా వున్న ఖాళీ స్థలంలో వైసీపీ ప్లీనరీ జరగనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు, విజయవాడ, గుంటూరుకు మధ్య వున్న ఈ ప్రాంతాన్ని టీడీపీ తన కోటగా భావిస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో ఆయన పదవీప్రమాణ స్వీకారం చేశారు . ఆ తర్వాత కూడా ఏ ముఖ్య కార్యక్రమం తలపెట్టినా అమరావతి తర్వాత ఈ ప్లేస్ కి బాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ స్థలంలో జులై 8 , 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీ వేదిక ఏర్పాట్లకు సంబంధించి వైసీపీ నేతలు నేడు అధికారికంగా భూమి పూజ నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని ప్లీనరీ వేదికగా నిర్ణయించడం ద్వారా రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపుతోంది వైసీపీ. జాతీయ రహదారి నెంబర్ 5 కి అనుకుని వున్న ఈ ప్లేస్ కి దగ్గర్లోనే టోల్ గేట్, మహేష్ లాంటి సూపర్ స్టార్ ప్రమోట్ చేసిన ఓ భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ వున్నాయి. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అతివిలువైన హాయిలాండ్ కూడా ఈ ప్లీనరీ వేదికపై ఒకటిరెండు కిలోమీటర్ల లోపే. మొత్తానికి హైదరాబాద్ నుంచి పార్టీ ఆఫీస్ ని తరలించలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ ప్లీనరీ వేదిక నిర్ణయంతో వాటికి దీటైన సమాధానం చెప్పినట్టే అని భావిస్తున్నారు.