ఫ్లాప్‌ అవుతాయని తెలిసి కుడా ఆ సినిమాలు చేసాడట

allu aravind about sai dharam tej

సాయి ధరమ్‌ తేజ్‌ గత రెండు సంవత్సరాలుగా చేసిన చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా సక్సెస్‌ అవ్వలేదు. వరుసగా ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లు పడటంతో సాయి ధరమ్‌ తేజ్‌ ఢీలా పడిపోయాడు. తాజాగా ఈయన కరుణాకరన్‌ దర్శకత్వంలో చేసిన ‘తేజ్‌ ఐలవ్‌ యు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం అయినా తేజూకు సక్సెస్‌ను ఇస్తుందా అనేది ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. ఈ చిత్రంపై అంతా కూడా చాలా నమ్మకం ఉన్నారు. ఈ చిత్రం విజయాన్ని దక్కించుకుంటుందంటూ అల్లు అరవింద్‌ కూడా జోష్యం చెప్పాడు. కరుణాకరన్‌ ఒక మంచి దర్శకుడు అని, ఆయన దర్శకత్వంలో చేసిన ఈ చిత్రం తప్పకుండా ఒక భారీ బ్లాక్‌ బస్టర్‌ను అందుకుంటుందని చెప్పుకొచ్చాడు.

తాజాగా ‘తేజ్‌ ఐలవ్‌ యు’ చిత్రం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కేఎస్‌ రామారావుతో పాటు అశ్వినీదత్‌ మరియు అల్లు అరవింద్‌లు పాల్గొన్నారు. ఈ సమయంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ తేజూ సక్సెస్‌ కోసం ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. తేజూ ఒక్కో సక్సెస్‌ అతడి కళ్లలో ఆనందాన్ని పెంచుతుందని, తల్లి కళ్లలో ఆనందం కోసం తేజూ చాలా కష్ట పడ్డాడు, కష్టపడుతూనే ఉన్నాడు. గత చిత్రాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. ఆ సినిమా ఆడవు అంటూ ముందే చెప్పేవాడు. మరి ఎందుకు పని చేస్తున్నావని అడిగితే ముందు కమిట్‌మెంట్‌ ఇచ్చాను, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నాను అనేవాడు. కమిట్‌మెంట్‌ కోసం కెరీర్‌ను కూడా త్యాగం చేసేంతటి స్థాయి ఉన్న వ్యక్తి కనుక ఖచ్చితంగా తేజూ భవిష్యత్తులో మంచి స్టార్‌ అవుతాడనే నమ్మకం నాకు ఉందని ఈ సందర్బంగా అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చాడు.