అయ్యో.. అవి పుకార్లన్న దానయ్య!

Danayya Responds on bharat ane nenu movie payments Rumours

మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్ల షేర్‌ను రాబట్టిన భరత్‌ అనే నేను చిత్రంతో నిర్మాత దానయ్యకు భారీగా లాభాలు వచ్చినట్లుగా తొస్తోంది. అయితే దర్శకుడు కొరటాల శివ మరియు హీరోయిన్‌ కైరా అద్వానీలకు ఈయన పారితోషికం ఇవ్వలేదు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారీ లాభాలు వచ్చినప్పటికి వారికి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్‌ మీడియాతో పాటు పలు ఛానెల్స్‌లో కూడా ఈ విషయమై చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా దానయ్య మీడియాతో మాట్లాడుతూ… తాను దర్శకుడు కొరటాల శివకు మరియు హీరోయిన్‌ కైరా అద్వానీకి పారితోషికం పూర్తిగా ఇవ్వలేదు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, సినిమా విడుదలకు ముందే వారికి పూర్తి పారితోషికం ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు. తన సినిమా కోసం వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో పారితోషికం ఇస్తాను అని, ఏ ఒక్కరి పారితోషికంను తాను ఎప్పుడు కూడా ఆపలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటించబోతున్న జక్కన్న మల్టీస్టారర్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.