మోడీ సర్ కేజీఎఫ్‌–2కి సెలవు కావాలి.

యశవంతపుర: కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రమే ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’. భారీ అంచనాల మధ్య కేజీఎఫ్‌ 2 జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే తమ అభిమాన హీరో రాకీ భాయ్‌ థియేటర్లలో సందడి చేయనున్నాడని అభిమానులు తెగ సంబరపడుతున్నారు. బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. అయితే తాజాగా యశ్‌ అభిమానులు కొందరు ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ సినిమా విడుదల రోజును సెలవుగా ప్రకటించాలని ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్విటర్‌లో ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.