సీఎం జగన్‌ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి

Minister Ponguleti's sensational comments on relations with CM Jagan..!
Minister Ponguleti's sensational comments on relations with CM Jagan..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మో హన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో ఎప్పటి నుంచో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం విదితమే.. గతంలో ఆయన ఆ పార్టీ నుంచి ఎంపీగా కూడా పనిచేశారు.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి.. అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే, నాకు.. సీఎం వైఎస్‌ జగన్‌ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు అని స్పష్టం చేశారు పొంగులేటి.. తెలంగాణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసార విజయవాడ వెళ్లిన ఆయన.. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొక్కు చెల్లించుకోవడానికి కనకదుర్గమ్మ అమ్మ వారికి ఆలయానికి వచ్చానని తెలిపారు.

ఇక, 10 ఏళ్లలో అభివృద్ధి పేరుతో కేసీఆర్‌ అప్పులు చేశారని విమర్శించారు పొంగులేటి.. తెలంగాణ ప్రజలను ఆకాంక్షలను కేసీఆర్‌ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ధనిక తెలంగాణను కేసీఆర్‌ పదేళ్ల పాలనలో 5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని ఫైర్‌ అయ్యారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. నాకు సీఎం జగన్ కు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని పేర్కొన్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం తో విభజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తాం.. రెండు రాష్ట్రాల మధ్య ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తాం అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నా.. అన్నదమ్ముళ్ల మాదిరగా తెలుగు రాష్ట్రాల సమస్యను పరిష్కారం చేసుకుంటామని తెలిపారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. మరోవైపు.. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట.. ఇంద్రకీలాద్రికి వచ్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి.