పోలవరాన కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌ పూర్తి…

Polavaram Diaphragm Wall construction completed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రులకు జీవనాడిగా భావించి ఏకంగా సోమవారాన్ని పోలవారంగా మార్చి అధికారులను పరుగులు పెట్టిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం పూర్తయింది. కీలకంగా భావించిన డయాఫ్రమ్‌వాల్‌ పనులు ఈ శనివారంతో పూర్తయ్యాయి. సుమారు 1397 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో నదీగర్భంలో 40 నుంచి 93.5 మీటర్ల లోతున దీన్ని నిర్మించారు. ఈ వాల్ నిర్మాణంపై అనుమానాలను పటాపంచలు చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి రెండు సీజన్లలో ఈ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఫిబ్రవరి 1, 2017 న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా ప్రారంభించిన ఈ పనులు అదే ఏడాది జులై 24 వరకు సాగాయి. అనంతరం గోదావరిలో నీటి మట్టం పెరగడం, వాతావరణం అనుకూలించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. తర్వాత అక్టోబరు 9 న మళ్లీ ప్రారంభించా నవంబరు 15 నుంచి ఓ ఐదు రోజులు నిలిపేశారు. మళ్లీ నవంబరు 20 న పున:ప్రారంభించి జూన్ 9 నాటికి పూర్తిచేశారు. దాదాపు 412 రోజులు పాటు సాగిన ఈ పనులకు మొత్తం రూ.430 కోట్లు ఖర్చుచేశారు. ఆదివారంతో దీని పనులు ముగియడంతో నేడు సీఎం చంద్రబాబు అక్కడ ఫైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.

అసలేంటీ డయాఫ్రమ్‌వాల్ ?

గోదావరి నదీగర్భంలో నిర్మించే డయాఫ్రమ్‌వాల్‌ ఇంటి నిర్మాణానికి పునాది లాంటిది. 150 అడుగుల ఎత్తులో నిర్మించే ఎర్త్‌కమ్ రాక్ ఫిల్‌డ్యామ్‌లో 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టులో నీరు దిగువన 93 మీటర్ల లోతువరకూ లీక్‌ కాకుండా డయాఫ్రమ్‌వాల్‌ అడ్డుకుంటుంది. అందుకే ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఈ వాల్ కోసం సిమెంటు, ఇసుక, తక్కువ మోతాదులో కంకర వేసిన బెంటోనైట్‌ మిశ్రమాన్ని వాడటం విశేషం. దీన్ని ప్లాస్టిక్‌ కాంక్రీట్‌గా వ్యవహరిస్తారు. కాంక్రీట్‌ మాదిరిగానే పూర్తిస్థాయిలో గట్టి పడి, నదీ గర్భంలో జరిగే మార్పులకు అనుగుణంగా రూపాంతరం చెందడం దీని ప్రత్యేకత. అంటే భూకంపం వచ్చి సంకోచ, వ్యాకోచాలు చెందినా గోడకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదని, తిరిగి మామూలు స్థితికి మారిపోతుందని నిపుణులు తెలిపారు. దీని నిర్మాణంలో మొత్తం 1.18 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు.