యాత్రలో భాగమవ్వనున్న ప్రభాస్‌

Prabhas special appearance in Yatra Movie

టాలీవుడ్‌లో వరుసగా బయోపిక్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇటీవలే సావిత్రి జీవిత చరిత్ర ‘మహానటి’ ప్రేక్షకుల ముందుకు రాగా అదే దారిలో ఎన్టీఆర్‌, రాజశేఖర్‌ రెడ్డి ఇంకా పలువురి జీవిత చరిత్రలు ప్రస్తుతం తెరకెక్కుతున్నాయి. అందుకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ‘యాత్ర’ చిత్రంపై ఎక్కువ శాతం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముటి నటిస్తుండగా ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు ప్రభాస్‌ తన వంతు మద్దతుగా నిలువబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రమోషన్‌లో ప్రభాస్‌ పాలు పంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రభాస్‌కు ఆప్త మిత్రుడు అయిన విజయ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గతంలో ఈయన నిర్మించిన చిత్రానికి ప్రభాస్‌ తనవంతు సాయంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ప్రభాస్‌ ప్రజెన్స్‌ ఆ సినిమా స్థాయిని పెంచేసింది. అందుకే ఈ సారి కూడా యాత్రకు ప్రభాస్‌ హ్యాండ్‌ పడితే ఖచ్చితంగా హైలైట్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదట ‘యాత్ర’లో ప్రభాస్‌ను నటింపజేయాలని భావించినప్పటికి ఆయన స్థాయికి తగ్గ పాత్ర లేక పోవడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. యాత్ర సినిమా కోసం నాలుగు అయిదు రోజుల పాటు ప్రభాస్‌ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి యాత్రలో ప్రభాస్‌ కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్‌ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.