రకుల్‌ జీవితం ధన్యం అయ్యే పాత్ర

rakul preet singh to play Sridevi in NTR biopic

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ను పోషిస్తుండగా, ఎన్టీఆర్‌ భార్య పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఎన్టీఆర్‌ చిత్రం అనగానే ఖచ్చితంగా ఏయన్నార్‌, శ్రీదేవి, సావిత్రి, ఎస్వీఆర్‌ వంటి ప్రముఖులను చూపించాల్సిందే. వారు లేని ఎన్టీఆర్‌ బయోపిక్‌ అసంపూర్ణం. ఇప్పటికే సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు పాత్రను రానా, సూపర్‌ స్టార్‌ కృష్ణ పాత్రను మహేష్‌బాబు పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అతిలోక సుందరి శ్రీదేవి పాత్రను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది.

తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం శ్రీదేవి పాత్ర కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేశారని, త్వరలోనే ఎన్టీఆర్‌ చిత్రం షూటింగ్‌లో రకుల్‌ పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం మూడు నాలుగు సీన్స్‌లో మాత్రమే ఎన్టీఆర్‌కు జోడీగా శ్రీదేవి పాత్రలో రకుల్‌ కనిపించబోతుంది. అయినప్పటికి శ్రీదేవి వంటి దిగ్గజ నటి పాత్రను పోషించబోతున్నందుకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఉబ్బి తబ్బిబవుతుంది. తన జీవితం ధన్యం అయ్యిందని, తన నటనకు ఇదే పతాక స్థాయి అంటూ రకుల్‌ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చింది. ఇటీవలే సావిత్రి చిత్రంలో కీర్తి సురేష్‌ నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుని కీర్తి సురేష్‌కు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు శ్రీదేవి పాత్రలో మూడు నాలుగు సీన్స్‌ చేసినా కూడా ఖచ్చితంగా సక్సెస్‌ను దక్కించుకుని, మంచి పేరు సంపాదిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.