బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) ప్రస్తుతం భారీ పౌరాణిక ప్రాజెక్ట్ ‘రామాయణం’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు నితేష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్బీర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నాడు. మొదటి భాగం షూటింగ్ పూర్తవ్వగా, ప్రస్తుతం రెండో భాగం శరవేగంగా సాగుతోంది.
ఈ క్రమంలో రణ్బీర్కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త హాట్ టాపిక్గా మారింది. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య లో ఆయన సుమారు రూ.3.31 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన రణ్బీర్, “అయోధ్యే నన్ను ఎంచుకుందని నేను నమ్ముతున్నాను. ఆ పిలుపుకే నేను సమాధానం ఇచ్చాను” అని భావోద్వేగంగా పేర్కొన్నాడు.
శ్రీరాముడి పాత్ర కోసం రణ్బీర్ తన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కూడా మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. అలాగే హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పౌరాణిక గాథ మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయోధ్య పెట్టుబడితో పాటు ‘రామాయణం’ క్రేజ్ రణ్బీర్ కెరీర్లో మరో మైలురాయిగా మారనుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
