ఈ రోజుల్లో ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేయడమే హీరోలకు పెద్ద ఛాలెంజ్గా మారిన పరిస్థితుల్లో, కేవలం వారం గ్యాప్లో రెండు సినిమాలు థియేటర్లకు తీసుకొచ్చిన అరుదైన హీరో శ్రీవిష్ణు. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ రూపంలో ఈ డబుల్ ఫీట్ సాధించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. సాధారణంగా ఇలాంటి దశలో హీరోలు స్పీడ్ తగ్గిస్తారు. కానీ శ్రీవిష్ణు మాత్రం ఆ రూట్లో లేడని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం ఫాస్ట్ పేస్లో సినిమాలు చేస్తున్న హీరోల జాబితాలో శ్రీవిష్ణు టాప్ త్రీలో ఉన్నాడనే చెప్పాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్టైనర్ షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్టు సమాచారం. చివరి దశకు చేరుకున్నప్పుడు అప్డేట్స్ ఇవ్వాలనే ప్లాన్తో టీమ్ ఇప్పటివరకు సైలెంట్గా ఉంది.
అలాగే సామజవరగమన కాంబినేషన్ను రిపీట్ చేస్తూ, దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా కూడా ఫుల్ స్పీడ్లో ముందుకెళ్తోంది. ఈ రెండు సినిమాలు 2026లోనే విడుదలైతే ఆశ్చర్యం లేదు.
అలా జరిగితే, ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలు థియేటర్లకు ఇచ్చిన ఘనత శ్రీవిష్ణుకి దక్కే అవకాశం ఉంది. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయట. మాస్ జాతరతో నిరాశ పరిచిన రచయిత–దర్శకుడు భాను భోగవరపు ఈసారి మాస్ ఎలిమెంట్స్కు దూరంగా, పూర్తిగా ఫన్ సబ్జెక్ట్తో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్టు టాక్. ఈ ప్రాజెక్ట్ దాదాపు లాక్ అయినట్టేనని వినిపిస్తోంది.
ఇక రంగబలితో డిజాస్టర్ ఎదుర్కొన్న దర్శకుడు పవన్ బసంశెట్టి కూడా శ్రీవిష్ణుతో ఓ ప్రాజెక్ట్కు ఓకే తీసుకున్నట్టు సమాచారం. వీటిపై త్వరలో అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశముంది.
దర్శకుల ట్రాక్ రికార్డు కంటే స్టోరీ నచ్చితే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు శ్రీవిష్ణు. అయితే ఇదే సమయంలో క్వాలిటీపై కూడా కాస్త ఎక్కువ ఫోకస్ అవసరమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా విష్ణు విన్యాసంలో తన టైమింగ్, డైలాగ్ డెలివరీపై కొంత నెగటివ్ టాక్ వచ్చింది. మాటలను మింగేయడమే కామెడీ అన్న భావన నుంచి బయటకు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
అయినా సరే, శ్రీవిష్ణు లైనప్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్రిల్లర్స్ వైపు వెళ్లకుండా, పూర్తిగా వినోదాన్ని నమ్ముకోవడం అతడికి సేఫ్ గేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ స్పీడ్ ఫలితంగా మారుతుందా? లేదంటే మరిన్ని రిస్కులకా? అన్నది రాబోయే సినిమాలే తేల్చాలి.
