Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనుష్క, ఇలియానా, కాజల్, సమంత తెలుగుతెరపై ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో టాలీవుడ్ కు పరిచయమయ్యారు రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, రాశీఖన్నా. అందరిలానే తొలిరోజుల్లో అవకాశాల కోసం అష్టకష్టాలు పడ్డారు. తర్వాత స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు. అయితే వీళ్లముగ్గురికీ ఓ సారూప్యత ఉంది. కెరీర్ ప్రారంభంలో ముగ్గురూ హీరో సందీప్ కిషన్ తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా రెజీనా…సందీప్ కిషన్ తో కలిసి రొటీన్ లవ్ స్టోరీలో నటించారు. ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆమె ఇండస్ట్రీ దృష్టిలో పడ్డారు. తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. తర్వాత వంతు రకుల్ ప్రీత్ సింగ్ ది.
సందీప్ కిషన్ తో కలిసి ఆమె నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ టాలీవుడ్ లో ఆమె ఫేట్ ను మార్చివేసింది. 2013లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రిలీజయితే.. రెండేళ్లు తిరిగే సరికల్లా ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఆమె బాటలోనే రాశీఖన్నా కూడా సందీప్ తో కలిసి జోరులో నటించిన తరువాత…పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ ముగ్గురి సక్సెస్ చూసిన తరువాత..సందీప్ కిషన్ ను పాతతరం హీరో చంద్రమోహన్ తో పోల్చుతున్నారు సినీజనాలు. 70, 80 దశకాల్లో…ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమయిన హీరోయిన్లు మొదట చంద్రమోహన్ సినిమాల్లో చాన్సులు దక్కించుకుని…హిట్ లు సాధించేవారు. అప్పట్లో టాలీవుడ్ ను ఏలిన శ్రీదేవి, జయప్రద, జయసుధలు ముగ్గురూ చంద్రమోహన్ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నవాళ్లే. అందుకే చంద్రమోహన్ తో నటించడాన్ని కొత్త హీరోయిన్లు సెంటిమెట్ గా భావించేవాళ్లు. ఇప్పుడు అదే తరహాలో సందీప్ కిషన్ కొత్త హీరోయిన్లకు లక్కీ మ్యాన్ గా కనిపిస్తున్నారు. అయితే సందీప్ మాత్రం ఈ సెంటిమెంట్ ను నమ్మడం లేదు. రకుల్, రెజీనా, రాశీలు నిజాయితీగా కష్టపడ్డారని, అందువల్లే స్టార్స్ అయ్యారని సందీప్ వ్యాఖ్యానించారు. వాళ్లు స్టార్స్ కావడానికి తనతో నటించడం సెంటిమెంట్ అంటే నమ్మనని, ఒకవేళ అదే నిజమని అందరూ అనుకుంటే సంతోషమే అని సందీప్ చెప్పారు.