మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) టికెట్ రేట్ల అంశం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా నైజాం ఏరియాలో ఈ సినిమాకు టికెట్ ధరల పెంపు ఉండదని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం స్పష్టత ఇచ్చింది. ఈ విషయంలో ఇటీవల జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గతంలో భారీ చిత్రాలకు అధికంగా టికెట్ ధరలు పెంచడంతో సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో వెనకడుగు వేశారని ఎగ్జిబిటర్లు అభిప్రాయపడుతున్నారు. “అధిక ధరలతో ప్రేక్షకులను దూరం చేయొద్దు” అనే నినాదంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై గతంలో ముఖ్యమంత్రికి లేఖ రాయడం కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తెలంగాణలో సాధారణ ధరలకే సినిమా ప్రదర్శించాలని నిర్ణయించగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఎగ్జిబిటర్ల సంఘం వెల్లడించింది.
ఇలా రెండు రాష్ట్రాల్లో రెండు రకాల వ్యూహాలు అమలులోకి రావడంతో ‘పెద్ది’ బాక్సాఫీస్ కలెక్షన్లపై ఆసక్తికర ప్రభావం చూపే అవకాశముంది. నైజాంలో తక్కువ ధరల వల్ల ప్రేక్షకుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉండగా, ఏపీలో పెరిగిన రేట్లు ఓపెనింగ్స్ను బలంగా మార్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ ప్లానింగ్తో ‘పెద్ది’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
