Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా హీరో సాయిధరమ్ తేజ్, వివి వినాయక్ల కాంబినేషన్లో ఒక పక్కా మాస్ కమర్షియల్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఖైదీ నెం.150’ చిత్రం తర్వాత వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్తో తెరకెక్కిస్తున్నట్లుగా దర్శకుడు వినాయక్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రానికి దర్శకుడు వివి వినాయక్ ఒక మాస్ టైటిల్ను ఖరారు చేశాడు. ‘ధర్మ భాయ్’గా సుప్రీం హీరో తర్వాత మూవీకి టైటిల్ను ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే ఈ టైటిల్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్కు జోడీగా ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి నటిస్తుంది.
వరుసగా ఫ్లాప్లతో సతమతం అవుతున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్కు ఈ సినిమా అయినా సక్సెస్ అయ్యేనో చూడాలి. ఈ చిత్రం సక్సెస్ వినాయక్కు కూడా చాలా ముఖ్యం. ఖైదీ నెం.150 చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఆ విజయం క్రెడిట్ అంతా కూడా చిరంజీవికి పోయింది. అందుకే ఈ చిత్రాన్ని సక్సెస్ చేసి తన సత్తా చాటాలని దర్శకుడు వినాయక్ భావిస్తున్నాడు.