కాంగ్రెస్లో ప్రభ వెలిగినంత కాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రాంనారాయణరెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. టీడీపీలో చేరిన తర్వాత పార్టీ తనకు ఆశించినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో పేరుకుపోయి ఉంది. కొంతకాలంగా ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన సోదరుడు మరణించినప్పుడు అదేమీ లేదని స్టేట్మెంట్ ఇచ్చిన ఆనం నిజంగానే వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆషాఢం మాసం పూర్తయిన వెంటనే ఆయన వైసీపీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది.
ఆషాఢ మాసం ఈ నెల 11న పూర్తవనుండగా 13న ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆనాటికి జగన్ పాదయాత్ర విశాఖలో జరగనుంది దీంతో అక్కడ జరిగే బహిరంగ సభా వేదిక పైనే ఆనం జగన్ కప్పే కండువా కప్పుకుంటారని పార్టీలో ప్రచారం సాగుతోంది. గత కొంతకాలంగా ఆనం పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. దీంతో ఆయన టీడీపీని వీడబోతున్నారన్న ఊహాగానాలకి బలం చేకూరుతున్నాయి.