టాలీవుడ్ యాక్షన్ హీరో, మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. ఈ మధ్య ఆయన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం భరతవర్ష లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ కోసం గోపీచంద్ పూర్తిగా కొత్త లుక్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇదే కాకుండా, నూతన దర్శకుడు కుమార్ సాయి తో మరో సినిమా కూడా ఆయన లైన్లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎక్కువ భాగం లండన్ లో జరగనుండగా, సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు.
తాజాగా గోపీచంద్ లైనప్లో మరో క్రేజీ యాక్షన్ డ్రామా చేరినట్టు టాక్. ప్రముఖ స్టంట్ మాస్టర్ వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది ఫుల్ లెంగ్త్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందనుండగా, 70 MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాణం జరగనుంది. సంగీతాన్ని సామ్ సీఎస్ అందించనుండగా, పలువురు టాప్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్లో భాగం కానున్నారు.
ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవం మే 3న హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరగనుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే, గోపీచంద్ ఈ యాక్షన్ డ్రామా షూటింగ్లో జాయిన్ కానున్నాడు. యాక్షన్ అభిమానులకు ఇది మరో పండగలా మారబోతోంది.
