రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన’, రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘రణబాలి’ చిత్రాల షూటింగ్లతో వరుసగా పనిచేస్తున్నాడు. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉండగా, విజయ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం డిఫరెంట్ జానర్ చిత్రాలకు పేరుగాంచిన దర్శకుడు విక్రమ్ కుమార్తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉండగా, మొదట యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ను నిర్మించనుందని టాక్ వినిపించింది.
కానీ తాజాగా విజయ్ దేవరకొండ, విక్రమ్ కుమార్ ఇద్దరూ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ మ్యాడ్డాక్ ఫిల్మ్స్ ఆఫీస్లో కనిపించడంతో సీన్ మారినట్టే అనిపిస్తోంది. దీంతో నిర్మాత మారిపోయాడా..? ఈ ప్రాజెక్ట్ ద్వారా విజయ్ హిందీ ప్రొడక్షన్ హౌజ్తో చేతులు కలుపుతున్నాడా..? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
ఈ విషయంలో స్పష్టత రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా కొనసాగడం ఖాయం.
