అయ్యో… అవన్ని పుకార్లేనా?

Director Krish Responds on NTR movie cast and Crew

‘ఎన్టీఆర్‌’ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రస్తుతం బాలకృష్ణ మరియు విద్యాబాలన్‌తో పాటు ముఖ్య తారాగణంపై చిత్రీకరణ జరుపుతున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రను రకుల్‌ పోషించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అంతకు ముందు చంద్రబాబు నాయుడు పాత్రను రానా చేత, కృష్ణ పాత్రలో మహేష్‌బాబును, ఏయన్నార్‌ పాత్రను నాగచైతన్య లేదా సుమంత్‌తో చేయించాలని, సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌చే చేయించాలని ఫిక్స్‌ అయ్యారు అని, అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. ప్రముఖులైన వారి పాత్రల్లో వారి వారసులు నటించడం వల్ల సినిమా స్థాయి అమాంతం పెరుగుతుందనే వార్తలు వచ్చాయి.

ఇప్పటి వరకు ‘ఎన్టీఆర్‌’ గురించి వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే అని, అసలు ఇప్పటి వరకు ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేయలేదు అంటూ క్రిష్‌ క్లారిటీ ఇచ్చాడు. ఆ పాత్రకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదు అని క్రిష్‌ చెప్పుకొచ్చాడు. వార్తలను క్రిష్‌ కొట్టి పారేసిన నేపథ్యంలో ఆ పాత్రలకు గాను అంతా కొత్త వారే నటించే అవకాశం ఉందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ఇప్పటికే కాస్టింగ్‌ కాల్‌ ద్వారా చాలా మంది నటీనటులను ఎంపిక చేయడం జరిగింది. వారిని ఏయన్నార్‌, సావిత్రి, కృష్ణ, శ్రీదేవి పాత్రలకు ఉపయోగిస్తారేమో చూడాలి. ఆ లెజెండ్స్‌ పాత్రల్లో స్టార్స్‌ నటిస్తేనే సినిమాకు ఆకర్షణగా ఉంటుందని, అలా కాకుండా సామాన్యులు ఎవరు నటించినా కూడా ప్రేక్షకులను అలరించడం అసాధ్యం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.